బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా రామ్ మాధవ్ నియామకం: సింగపూర్లో హర్షాతిరేకాలు
(ప్రత్యేక ప్రతినిధి – సింగపూర్)
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ఉపాధ్యక్షుడిగా శ్రీ రామ్ మాధవ్ తిరిగి నియమితులవడం పట్ల ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకంపై ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ, రామ్ మాధవ్కు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ, రామ్ మాధవ్తో తమకు ఎన్నో ఏళ్లుగా విడదీయరాని ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ పర్యటన సందర్భంగా 2015లో రామ్ మాధవ్ సహకారంతో, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తితో కలిసి “సింగపూర్ వెల్కమ్స్ మోదీ” (Singapore Welcomes Modi) కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని తెలిపారు.
అంతేకాకుండా, అంతర్జాతీయ విశ్లేషకుడిగా రామ్ మాధవ్ రచించిన ప్రసిద్ధ గ్రంథాలైన The Hindutva Paradigm, Partitioned Freedom, The Indian Reality, The New World వంటి పుస్తకాల పరిచయ వేదికలను సింగపూర్లో విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆవిర్భావం నాటి నుంచి సంస్థ చేపట్టిన అనేక సాంస్కృతిక సదస్సులు, ఉత్సవాలకు రామ్ మాధవ్ స్వయంగా హాజరై తమ అమూల్యమైన ప్రోత్సాహాన్ని అందించారని కొనియాడారు. సింగపూర్ గడ్డపై తెలుగు భాష, సాహిత్యం, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించే క్రమంలో ఆయన అందించిన మార్గదర్శకత్వం ఎనలేనిదని శ్లాఘించారు. ఆయన అపారమైన అనుభవం, దార్శనిక నాయకత్వం పార్టీ బలోపేతానికే కాకుండా, దేశాభివృద్ధికి, ప్రవాస భారతీయులతో సత్సంబంధాల పెంపునకు మరింతగా ఉపయోగపడుతుందని రత్న కుమార్ ఆకాంక్షించారు.
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad

