విశ్వవేదికపై తెలుగు వైభవం!

సాహిత్యం United States USA

‘ఆటా’ సభల్లో ఏనుగు నరసింహారెడ్డి ఆత్మీయ ప్రసంగం

అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగిన ‘ఆటా’ (అమెరికన్ తెలుగు అసోసియేషన్) సభలు తెలుగువారి మాతృభాషాభిమానానికి దర్పణంగా నిలిచాయి. ఖండాంతరాల్లో తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక వైభవాలను చాటేలా సాగిన ఈ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు చేసిన ప్రసంగం సభికులను అక్షరాలా మంత్రముగ్ధులను చేసింది. అద్భుతమైన ఆయన ప్రసంగంలోని ఆణిముత్యాలను, తెలుగు భాషా సాహిత్యాల ప్రాచీనతను మన పత్రిక పాఠకుల కోసం అందిస్తున్నాం.

వెయ్యేళ్లకు మించిన ప్రాచీనత

తెలుగు భాషకు కేవలం వెయ్యేళ్ల కవిత్వ చరిత్రే ఉందా అన్న చర్చ వచ్చినప్పుడు, అంతకు ముందు నుంచే మనకు కవిత్వం ఉందని నిర్ద్వంద్వంగా నిరూపించిన చారిత్రక సాక్ష్యం ‘బొమ్మలగుట్ట శాసనం’. దీని ఆధారంగానే నేడు మనం ప్రాచీన భాషగా గర్వకారణమైన గౌరవాన్ని పొందుతున్నాము.

నన్నయ రాసిన ఆదిపర్వంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. కణ్వ మహర్షి ఆశ్రమంలోకి దుష్యంత మహారాజు ప్రవేశించే సందర్భం అది. సాధారణంగా కవులు ఉత్పలమాల, చంపకమాల లాంటి వృత్తాలను ఎంచుకుంటారు. కానీ, రథాల సమూహంతో మహారాజు వస్తూ ఉంటే ఆ పటాటోపం, ఆ శబ్దం ఎలా ఉంటుందో పాఠకుడికి కళ్లకు కట్టాలని నన్నయ భావించాడు. అందుకే, గుర్రాల డెక్కల చప్పుడును ధ్వనించేలా ‘కవిరాజవిరాజితం’ అనే ఛందస్సును ఎంచుకున్నాడు. “చరిచెన నిముంద కణ్వాశ్రమ హవ్యధూమ లతా తతులన్… గణగణ గణగణ…” అంటూ ఆ పద్యం సాగుతుంటే ఆశ్రమంలోకి రథం దూసుకొస్తున్న శబ్దమే పాఠకుడికి వినిపిస్తుంది.

అతిశయోక్తికి అందమైన రూపాలు

మన కవుల ఊహాశక్తికి హద్దులు లేవు అనడానికి కొరవి గోపరాజు రాసిన ‘సింహాసన ద్వాత్రింశతిక’ ఒక చక్కటి ఉదాహరణ. ఎండాకాలం తీవ్రత గురించి దాదాపు అందరూ కవులు రాశారు. కానీ, ఆయన తనదైన శైలిలో… “ఎండలకు తాళలేక నీడలు చెట్ల కిందికి వెళ్లి దాక్కున్నాయి” అని వర్ణించాడు.

అలాగే పొన్నగంటి తెలగనార్యుడు రాసిన ‘యాయాతి చరిత్ర’లో అతిశయోక్తి అలంకారాన్ని ప్రయోగించిన తీరు అసామాన్యం. ప్రాగ్జ్యోతిషపురం మీదుగా ప్రయాణం చేస్తున్న సూర్యుడు అక్కడి మేడల ఎత్తును దాటలేక పక్కకు జరిగి ప్రయాణించాడట! రాత్రివేళ చంద్రుడు ఆ మేడల మీదుగా వస్తూ, లోపల ఉన్న అంతఃపుర కాంతల ముఖాలను చూసి, ఎక్కడ తాను వెలవెలబోవాల్సి వస్తుందోనన్న సిగ్గుతో కుడివైపు నుంచి తప్పుకుని వెళ్లాడట.

పెదవి తగలకుండా రామాయణం – అద్భుత పాండిత్యం

సాధారణంగా ‘రామ’ అని పలకగానే రెండు పెదవులు కలుస్తాయి. కానీ, అచ్చ తెలుగులో అసలు పెదవులు తగలకుండా ఆశువుగా కవిత్వం చెప్పిన వంశం ‘మరింగంటి’ వంశం. పెదవులు తగలకుండా రామాయణం రాసి దానికి ‘దశరథరాజనందన చరిత్ర’ అని పేరు పెట్టారు. ఈ ప్రయోగం గురించి విన్న పండితులు ఆశ్చర్యపోయి, వారిని పరీక్షించడానికి నల్గొండ దగ్గరి కనగల్ లోని వారి ఇంటికి వెళ్లారట. అక్కడ ముగ్గు వేస్తున్న పనిపిల్లను పిలిచి, పంతులు గారు ఏం చేస్తున్నారని అడిగితే… ఆ అమ్మాయి ఏమాత్రం తడుముకోకుండా, పెదవులు తగలకుండా “వారు దశరథరాజనందన చరిత్ర లిఖించుచుండిరి” అని సమాధానం ఇచ్చిందట! ఆ పనిపిల్లకే అంతటి పాండిత్యం ఉంటే, కవి గారి ప్రతిభను తట్టుకోవడం కష్టమని ఆ పండితులు వెనుతిరిగారు.

ఆధునిక కవిత్వం – విశ్వవ్యాప్త ఆకాంక్ష

ప్రాచీన సాహిత్యం మాత్రమే కాదు, ఆధునిక కాలంలో గురజాడ అప్పారావు గారు ముత్యాల సరాలు అనే కొత్త ఛందస్సును సృష్టించి, సమాజంలోని దురాచారాలను ఎంత గొప్పగా ఎత్తిచూపారో మనకు తెలిసిందే. విశ్వనాథ వారి ‘కిన్నెరసాని’ నడకలు, గుర్రం జాషువా గారి ‘ఫిరదౌసి’ లోని కాల్పనిక విషాదం… ఇవన్నీ తెలుగు కవిత్వానికే తలమానికాలు.

మనం విదేశీ రచయితలను తెలుగులోకి అనువదించుకుని చదువుతున్నాము. కానీ, ఎంతో అద్భుతమైన మన తెలుగు కవుల సాహిత్యం పరభాషల్లోకి ఎంతవరకు వెళుతోంది? అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఈ సందేహాలను పటాపంచలు చేస్తూ, తెలుగు సాహిత్యాన్ని ఖండాంతరాలకు వ్యాప్తి చేయడంలో ‘ఆటా’ లాంటి సంస్థలు కృషి చేయాలని ఆకాంక్షిస్తూ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు ముగించిన ఈ ప్రసంగం, ప్రతి తెలుగువాడి గుండెల్లో మాతృభాష పట్ల మరింత గౌరవాన్ని పెంచింది.

  • పురుషోత్తం నారగౌని

What do you feel about this post?

60%
like

Like

20%
love

Love

20%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *