రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospital)లో చికిత్సపొందుతున్న వైద్య విద్యార్థిని ప్రియాంక (Priyanka) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రియాంకకు ఆప్నియా టెస్ట్ చేయడానికి వైద్యులు ప్రయత్నించగా, ఆమె శరీరం సహకరించకపోవడంతో విరమించుకున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆమె తల్లిదండ్రులతో వైద్యులు చర్చించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాల (GSL Medical College)లో కర్నూలుకు చెందిన ప్రియాంక డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. రాజమహేంద్రవరం ప్రసాద్ ఆదిత్యమాల్లో సినిమా చూసి, సహచర విద్యార్థితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. రద్దీ కారణంగా వాహనాలు థియేటర్ గేటు వద్ద ఆగగా, అదే సమయంలో నామవరానికి చెందిన సురవరపు దుష్యంత్ (Suravarapu Dushyanth), లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్ (Andrew William Joseph)లు మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టారు. తరువాత మరోసారి బలంగా ఢీకొట్టి పైనుంచి కారు వెళ్లడంతో కిందపడిపోయిన ప్రియాంక తలకు తీవ్ర గాయమైంది. ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad
